Monday, December 28, 2009

చేనేతకోసం పూజ

అప్పుల బారినపడి, సదుపాయాలు లేక మన రాష్ట్ర చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అమెరికాలోని ఒక బాలికను కదిలించింది. వారి దీనావస్థలను ప్రపంచానికి తెలియజెప్పి వారికి అండగా నిలవాలని సంకల్పించింది. ఆమె ఎవరంటే, అమెరికాలోని న్యూజెర్సీలో లివింగ్‌స్టన్ ఉన్నత పాఠశాలలో టెన్త్ గ్రేడ్ విద్యార్థిని. పేరు ఎప్పనపల్లి పూజా జ్యోతి. చేనేత కార్మికుల సంక్షేమం లక్ష్యంగా http://www.saveweavers.org అనే వెబ్‌సైట్ ప్రారంభించింది. దీని ద్వారా లక్ష సంతకాలు సేకరించి, తగిన చర్యల నిమిత్తం వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నది పూజా జ్యోతి లక్ష్యం.

చేనేత కార్మికులు జీవితాలు బాగుపడేందుకుగాను ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలు, జైళ్ళు, సైన్యం విధిగా చేనేత ఉత్పత్తులు ధరింపజేసి, ప్రజల్లోనూ ఈ చైతన్యం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నది జ్యోతి సలహా. ఈ చిన్నారి చేపట్టిన ఈ మహత్కార్యానికి అమెరికా, బ్రిటన్, అస్ట్రేలియాతో బాటు వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు పలికారు.

పూజకు ఈ ఆలోచన వచ్చినప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణుడైన ఆమె తండ్రి ఇ.హరికిషన్ తన కుమార్తెను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. ఆమె చేపట్టిన ఈ "సామాజిక పూజ" ఫలించాలని మనమూ కోరుకుందాం.

Wednesday, December 23, 2009

సలాం తాహెరాబేగం

కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న మహిళలెందరికో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన తాహెరాబేగం జీవితం ఆదర్శప్రాయం. తాహెరాకు చిన్నవయసులోనే పెళ్ళయ్యింది, పుట్టిన పిల్లలిద్దరిలో ఒకరికి చూపులేదు. 22 ఏళ్ళ వయసు వచ్చేసరికి భర్త (లారీ డ్రైవర్) మరణించాడు. ఫలితం, అత్తమామల నిరాదరణ. ఇక చేసేదేమీలేక పుట్టిల్లయిన లక్సెట్టిపేటకు వెళ్ళింది. తాహెరా తండ్రి సంపాదన ఏమంత ఎక్కువకాదు. తన కుమారులతో తండ్రికి భారం కావడం ఇష్టం లేదామెకు. ఇక ఏం చేసింది ? చిన్నతనంలో తాను తండ్రి దగ్గర నేర్చుకున్న టైర్ల మరమ్మతు, రీముల బిగింపు పనుల్నే జీవనాధారంగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. సాయం చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదుగానీ, పుల్లవిరుపు మాటలు బోలెడు ఎదురయ్యాయి. పరదా మధ్య ఉండాల్సిన మహిళ పంక్చర్లు వేయడమేంటని ఎద్దేవా చేశారు. తాహెరా పెద్దకొడుకుకు చూపులేకపోవడంతో కుటుంబ భారం ఆమెపైనే పడింది. ఆలేకుం అస్సలాం తాహెరా...

Tuesday, December 22, 2009

ఎనిమిది గంటలపని

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ స్త్రీవాది, సంఘ సంస్కర్త ఆడమ్స్ జేన్. 1860లో జననం, 1935లో మరణం. తన దేశపు మహిళలకోసమేగాక అమెరికాకు వలసవచ్చిన నల్లజాతి స్త్రీలు, చిన్నారుల కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. పీస్ అండ్ బ్రెడ్ ఇన్ టైమ్ ఆఫ్ వార్, డెమొక్రసీ అండ్ సోషల్ ఎథిక్స్ వంటి అద్భుత రచనలు చేసిన ఈమె కృషి ఫలితంగానే స్త్రీలకు ఎనిమిది గంటల పని వ్యవస్థ అమలులోకి వచ్చింది. 1931లో ప్రొఫెసర్ నికాలస్ ముర్రే బట్లర్‌తో కలసి నొబెల్ బహుమతినందుకున్న ఆడమ్స్ జేన్ 1910లో 'నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సోషల్ వర్క్' తొలి అధ్యక్షరాలిగా పనిచేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెటిల్‌మెంట్స్ స్థాపనకు చేయూతనిచ్చిన జేన్, నేషనల్ అమెరికన్ ఉమెన్ సఫరేజ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. శాంతి, స్వేచ్ఛ కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా సంస్థకు కొంతకాలం నేతృత్వం వహించారు.