Friday, April 30, 2010

పట్టభద్రురాలు... లారీ చోదకురాలు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన యోగితకు రాజ్ బహదూర్‌తో పెళ్ళయ్యే వరకూ అమ్మానాన్నల చాటుబిడ్డగానే ఉంది. లారీ డ్రైవర్ అయిన భర్త, ఇద్దరు పిల్లలతో సజావుగా జీవితం సాగిపోతుండగా సమయాన్ని వృథా చెయ్యడమెందుకని కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, న్యాయశాస్త్రంలో బిఎల్ పట్టా కూడా సాధించింది. ఇవిగాక ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో డిప్లొమాలు అందుకుంది. అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే ఇది జీవితం ఎందుకవుతుంది. ఒక రోడ్డు ప్రమాదంలో యోగిత భర్త చనిపోయాడు. ఇక తాను చదువుకున్న చదువులు, నేర్చుకున్న వృత్తి విద్యలతో జీవితాన్ని నెట్టుకొద్దామనుకున్న యోగితకు అవి నాలుగు మెతుకులు కూడా పెట్టలేదు. ఇలా లాభం లేదనుకున్న యోగిత, తన భర్త విడిచిన లారీ స్టీరింగ్‌ను తాను అందుకుని ఎలాగో లారీ డ్రైవింగ్ నేర్చుకుంది. లారీ డ్రైవింగ్‌లో తొలి మహిళగా గుర్తింపు పొందడమేగాక మధ్యప్రదేశ్‌లో ఉత్తమ లారీ డ్రైవర్‌గానూ గౌరవం అందుకుంది ఈ యోగ్యురాలు. భర్త పోయిన మహిళలు సాధారణంగా పుట్టింటివైపు దీనంగా చూస్తుంటారు. నిజానికి వీరంతా చూడాల్సింది ఆదర్శనారి యోగితలాంటి వారివైపు....